Friday, December 12, 2025

ప్రియమైన జ్ఞాపకం


(జయమోహన్, అరంగసామి, మానస చామర్తి, పూడూరి రాజిరెడ్డి) 

ఈ ఫొటో నాకెంతో ప్రియమైన జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. నాకిష్టమైన ఇద్దరు రచయితల పక్కన. ఈ లోకం మర్చిపోయినట్టు సంభాషణలో మునిగిపోయి ఉండటాన్ని, అంతే భద్రంగా, అంతే అందంగా, నాకొక జ్ఞాపకంగా ఇచ్చారు భాస్కర్. ఇలాంటి ఫొటో ఒకటి తీస్తున్నారని కూడా తెలీదు నాకు. రాజిరెడ్డి కథల్లో లేయర్స్ గురించి మాట్లాడారని చెప్పాను కదా. ఈ ఫొటో ఆయనకు పంపిస్తే, ఫొటోలో కూడా లేయర్స్ ఉన్నాయ్ అన్నారు. 

🙂 ఆ రోజు ఉదయం నుండి, సాయంకాలపు మసక వెలుతుర్ల దాకా - వెల్లువెత్తిన సంతోషాల నుండి - రెండు అరచేతుల మధ్య భద్రంగా ఇష్టంగా పట్టుకుని వదిలేసిన వీడ్కోలు తాలూకు పల్చని దిగుళ్ళ దాకా - అన్నింటికి కలిపి ఒకే జ్ఞాపకంగా ❤️


(19-8-2024 నాటి మానస చామర్తి ఎఫ్బీ పోస్ట్‌)

 ----------------------------------------------------


ఫొటో నేపథ్యం:

2024 ఆగస్ట్‌లో బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు, అది జరిగే మూడ్రోజుల్లో ఒక్కసారైనా జయమోహన్‌ను కలిసే అవకాశం రాకపోతుందా అనుకున్నా. ఆశ్చర్యంగా మొదటి రోజు పరిచయమైన మొదటి మనిషి ఆయనే. నేను ఎప్పటికో క్లైమాక్స్‌ టార్గెట్‌ లాగా పెట్టుకున్నది టైటిల్స్‌లోనే జరిగిపోయినట్టయింది. నా పేరులోని స్త్రీత్వపు ధ్వని గురించి మళ్లీ మళ్లీ అడిగారు.

నేను బెంగళూరు వస్తున్నట్టు తెలుసు కాబట్టి, ఒక్కరోజైనా ఇంటికి రావాల్సిందేనని మానస చామర్తి పిలవడంతో తెల్లారి వాళ్లింటికి వెళ్లాను. మరునాడు ఇద్దరమూ తిరిగి వచ్చాక, ఆ కార్యక్రమాలన్నీ ఉత్సాహంగా చుట్టేస్తూ పిల్లల కోడిలా తిరుగుతున్న జయమోహన్‌కు ఎదురుపడ్డాం. ఆయన మమ్మల్ని కూడా కాఫీకి వెంటబెట్టుకెళ్లారు. అవినేని భాస్కర్‌ సహజంగానే తోడయ్యారు. అప్పుడు జయమోహన్‌తో మామూలుగా మాట్లాడిన మాటలే, తర్వాత మానస రాతలో పద్ధతిగా ‘వివిధ’లో వచ్చాయి.

ఈ ఫొటో నాకెంతో ప్రియమైన జ్ఞాపకంగా గుర్తుండిపోయింది.

Tuesday, December 9, 2025

పిల్లల కథ


 బాలోత్సవం


కథ పుట్టడమూ, పిల్లల కథ పుట్టడమూ వేరుగా జరిగివుండదు. పిల్లల కంటే బాగా ‘ఊ’కొట్టగలిగేవారెవరు! పిల్లలను మైమరిపించడానికే పెద్దలు కథలు అల్లివుంటారు. ఆ వంకతో తమ చిన్నతనంలోకీ జారుకునివుంటారు! చిన్నతనానికీ పెద్దరికానికీ ఉన్న స్పష్టమైన తేడా: బాల్యంలో ఊహలకు సంకెళ్లుండవు. తార్కిక పరిమితి కలలను అణిచివేయదు. ఎంత సాగితే అంత, ఎంత చూస్తే అంత, ఎంత కావాలనుకుంటే అంత. అక్కడ ఆశలు అనంతం. రెక్కలు అమాంతం. కప్పలు పకపకా నవ్వొచ్చు. కుందేళ్లు చకచకా మాట్లాడొచ్చు. కాకులు నీతులు చెప్పొచ్చు. జింకలు కోతలు కోయొచ్చు.

పిల్లల కథ అనేది మబ్బుల్లోకి గెంతించే మాయా కిటికీ. సముద్రం అడుగుకు ఈదనిచ్చే గాలి పడవ. ప్రతి తరమూ తర్వాతి తరానికి అవసరమయ్యే వివేకపు రాశిని కథల రూపంలోనే బదిలీ చేస్తుంది. లోకాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే కాఠిన్యాన్ని అందులోనే కూరి ఉంచుతుంది. ఈసప్‌ కథలు, పంచతంత్రం కథలు, వెయ్యొన్నొక్క రాత్రుల అరేబియన్‌ కథలు, జంగిల్‌ బుక్, కాంచన ద్వీపం, గలివర్‌ సాహసయాత్రలు, ‘చందమామ’ కథల నుంచి; టామ్‌ శాయర్, నొప్పి డాక్టర్, లిటిల్‌ ప్రిన్స్, హాబిట్, హారీ పాటర్‌ దాకా పిల్లల మనో ప్రపంచపు ఎల్లలను విశాలపరిచినవే! కథల వల్ల పిల్లలకు ఊహాశక్తి పెరుగుతుంది, సమస్యా పరిష్కారం తెలుస్తుంది, భాష అబ్బుతుంది, వ్యక్తీకరణ అలవడుతుంది, లోకరీతి అర్థమవుతుంది, ప్రపంచపు భిన్నత్వం పట్ల అవగాహన కలుగుతుంది, సాటి జీవుల పట్ల సానుభూతి కలుగుతుంది, తమ సాంస్కృతిక వారసత్వపు గొప్పతనం అనుభవంలోకి వస్తుంది, అన్నింటికీ మించి అమితమైన ఆనందం దొరుకుతుంది. జీవితపు సంరంభంలోంచి వచ్చే ఆనందానికి అదనంగా, మనిషికి ఉన్న మరో ఆనందపు వనరు కథలు కాక మరేమిటి?

అసలు పిల్లల కథలు పిల్లలకు కలిగించే ప్రయోజనాలన్నీ పెద్దలకు కూడా కలిగిస్తాయి. ఏం పెద్దల్లో మాత్రం పిల్లలు బజ్జునిలేరా? అంతెందుకు, ఆరిస్టాటిల్‌ లాంటి తత్వవేత్త కూడా నిజమైన మంచి జీవితం గడపడం కోసం కాల్పనికత అవసరాన్ని సమర్థించాడు. అసలు సాధ్యం కానిది కూడా ఊహించగలగడం అవసరమని ఆయన వాదించాడు. టాల్‌స్టాయ్‌ లాంటి మహారచయిత కూడా పిల్లల కోసం కథలు రాశాడు. కాకపోతే ఇదీ నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పకూడదనీ, కథ ద్వారా పిల్లలు తమకు కావాల్సింది తాము తీసుకుంటారనీ అన్నాడు. మీరు ఎంతపెద్దవాళ్లయినా బాలసాహిత్యాన్ని చదవాలంటుంది కాథెరీన్‌ రండెల్‌ అనే బాలసాహిత్య రచయిత్రి. పిల్లల పుస్తకాలు మనం మర్చిపోయిన విషయాలనే కాదు, మనం మర్చిపోయామని మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుచేస్తాయంటుందామె.

లండన్‌లోని థేమ్స్‌ నదిలో పడవ షికారుకు పోయినప్పుడు తన వెంటున్న స్నేహితుడి ముగ్గురు కూతుళ్లకు ఓ కథ చెప్పాడట లూయిస్‌ కరోల్‌. అందులో అలీస్‌ లిడ్డెల్‌ అనే పదేళ్ల పాప కూడా ఉంది. ఒక రోజు నది ఒడ్డున విసుగ్గా కూర్చున్న ‘అలీస్‌’కు కోటు తొడుక్కుని, గడియారం పెట్టుకున్న ఒక తెల్ల కుందేలు కనబడటమూ, దానివెంట ఆమె ఆ కుందేలు బొరియలోకి పోవడమూ, అక్కడ్నుంచి వింతలూ విచిత్రాలూ... వాహ్‌! విన్నవెంటనే దాన్ని తనకోసం రాసిపెట్టమందట అలీస్‌. అట్లా ‘అలీస్‌(స్‌) అడ్వెంచర్స్‌ ఇన్‌ వండర్‌లాండ్‌’ పుస్తకంగా రూపుదాల్చింది. 1865 నవంబర్‌లో తొలిసారి ప్రచురితమైన దీనికి ఈ నెలలోనే 160 ఏళ్లు వచ్చాయి. జంతువులు జంతువుల్లా ఉండకుండా, మనుషులు మనుషుల్లా కాకుండా ప్రవర్తించే సాహిత్యాన్ని ‘నాన్సెన్స్‌ లిటరేచర్‌’ అని వర్గీకరించడం ఉంది. దాన్ని నిరర్థకమైనదని కాకుండా, హేతువుకు అందని అర్థవంతమైన సాహిత్యం అన్న అర్థంలో చూడాలి. అందుకేనేమో, ఇకనుంచీ బాల సాహిత్యానికీ తమ అవార్డు ఇవ్వనున్నట్టు బుకర్‌ ఫౌండేషన్‌ ఇటీవలే ప్రకటించింది. 8–12 ఏళ్ల  చిన్నారులను ఉద్దేశించి రాసే ఉత్తమ రచనకు ‘చిల్డ్రెన్స్‌ బుకర్‌ ప్రైజ్‌’ పేరుతో యాభై వేల పౌండ్లు ఇవ్వనున్నారు. బాలసాహిత్యం అనేది తీసేయదగినది కాదనీ, బాలసాహితీవేత్తలు తక్కువ రచయితలేమీ కారనీ చెప్పే ఘనమైన వార్త ఇది. కాదామరి... నేటి బాలలే రేపటి ప్రపంచ నిర్మాతలు.

(10-11-2025)

Saturday, December 6, 2025

తమ్ముడి మరణం కథాపఠనం





Thammudi Maranam


మనకు తెలీకుండా మన కథను ఎవరైనా చదివారని తెలిసినప్పుడు– మనకు కనీసం చెప్పనైనా లేదే అన్న అది ఉంటుంది; వాళ్లు మన కథను సెలబ్రేట్‌ చేస్తున్నారన్న ఇదీ ఉంటుంది. ఈ ‘కథాకళ’ కోసం డాక్టర్‌ వారిజా రాణి గారు నా ‘తమ్ముడి మరణం’ చదివారు. ఈ మూడు కథల వీడియోలో మొదటి రెండు కథల్ని డాంజీ తోటపల్లి, చిట్టూరు సరస్వతి రాధ గార్లు చదివారు. తమ్ముడి మరణం మూడో కథ. 1:20 గంటల నుంచి ఆ కథాపఠనం ఉంది. నిర్వహణ: విజయ భాస్కర్‌ రాయవరం.

(25th March 2023)

Wednesday, December 3, 2025

నా కొత్త కథ

నా కొత్త కథ


ఈమాట నవంబర్‌ సంచికలో ప్రచురితమైన నా కొత్త కథ ‘తండ్రి’ ఈ లింకులో చదవొచ్చు.

 

తండ్రి  

Sunday, November 30, 2025

స్వామినాథన్‌ జీవిత చరిత్ర


 

ఎం.ఎస్‌.స్వామినాథన్‌:

ద మ్యాన్‌ హూ ఫెడ్‌ ఇండియా
(జీవిత చరిత్ర)
––––
రచన:
ప్రియంవద జయకుమార్‌



గొప్ప శాస్త్రవేత్త... చక్కటి వ్యవహర్త


ఉన్నత విద్యావంతులున్న ఉమ్మడి వ్యవసాయ కుటుంబంలో మోన్‌కోంబు సాంబశివన్‌ స్వామినాథన్‌ జన్మించారు(తమిళనాడు, 1925). తండ్రి బాటలో మెడిసిన్‌ చదివి కుంభకోణంలోని వాళ్ల హాస్పిటల్‌ను నడిపే అవకాశం; ఐపీఎస్‌కు ఎంపికైనందున అటు వైపుగానూ కెరీర్‌ మలుచుకునే వీలు ఆయనకు ఉండినాయి. కానీ లక్షల మంది చావులకు కారణమైన బెంగాల్‌ క్షామం(1943) వేసిన ముద్ర ఆయన్ని వ్యవసాయం వైపు నడిపించింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన చేసిన కృషిని చెప్పే పుస్తకం ‘ఎం.ఎస్‌.స్వామినాథన్‌: ద మ్యాన్‌ హూ ఫెడ్‌ ఇండియా’. ఇది ఆయన మేనకోడలు రాసిన ఆయన జీవిత కథ.

స్వాతంత్య్రానంతర భారతదేశం దశాబ్దాల పాటు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య... తిండి గింజల కరువు. ‘ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు’ అన్నారు నెహ్రూ. సోమవారాలు పస్తులుండమని జనానికి పిలుపునిచ్చారు లాల్‌ బహదూర్‌ శాస్త్రి. ‘బ్లడీ అమెరికన్ల’ ముందు చేయి చాచకుండా ఉండే మార్గాల కోసం వెతికారు ఇందిరా గాంధీ. ఒక దశలో ‘పీఎల్‌ 480’ పథకం కింద అమెరికా పంపే గోధుమలే దిక్కు. ఓడలు దిగితేగానీ నోళ్లు ఆడని పరిస్థితి. ఈ దిగుమతులకు చెల్లించాల్సిన మూల్యం విదేశాంగ విధానంలో స్వతంత్రంగా నిలబడలేకపోవడం. అలాంటి స్థితిగతుల్లో ‘ఆకలి నుంచి స్వేచ్ఛే అన్నింటికన్నా గొప్ప స్వేచ్ఛ’ అన్నట్టుగా, స్వామినాథన్‌ దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచారు. ‘చరిత్ర ఆయనకు అవకాశం ఇచ్చింది, దాన్ని ఆయన రెండు చేతులా అందుకున్నారు’ అంటారు రచయిత్రి.

గాలికి పడిపోకుండా నిలబడే పొట్టి రకం గోధుమల మీద గామా కిరణాలతో ‘ఐండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో స్వామినాథన్‌ ప్రయోగాలు చేశారు. దానికోసం ‘ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌’ సాయంతో ‘గామా గార్డెన్‌’ ఏర్పాటుచేశారు. వ్యవసాయం కోసం అన్ని రంగాలు సహకరించుకోవాలంటారాయన. ఈ దశలోనే పొట్టి రకం హైబ్రిడ్‌ గోధుమలను మెక్సికోలో నార్మన్‌ బోర్లాగ్‌ విజయవంతంగా పరీక్షించారని తెలిసి, స్వామినాథన్‌ ఆయనకు ఉత్తరం రాశారు(1963). దానివల్ల పదేళ్ల కాలం కలిసొస్తుందనేది ఆయన ఆలోచన. ఇక వంద కేజీల చొప్పున వచ్చిన ఆ నాలుగు రకాల విత్తనాలను ఇక్కడి నేలలకు అనుగుణంగా కల్యాణ్‌ సోనా, సోనాలిక లాంటి విత్తనాలుగా మార్చి, వ్యవస్థలోని అన్ని అడ్డంకులను అధిగమించి, రైతుల అనుమానాలను తీర్చి, దిగుబడుల ‘చమత్కారాన్ని’ చూపించి, ఇండియా వచ్చిన నార్మన్‌ బోర్లాగ్‌నే ఆశ్చర్యపరిచేలా చేశారు స్వామినాథన్‌. నాలుగు హెక్టార్లతో మొదలైన ప్రయోగం, 1968 నాటికి పది లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఈ మధ్యలోనే విక్రమ్‌ సారాభాయి సహకారంతో రైతుల కోసం దూరదర్శన్‌లో ‘కృషి దర్శన్‌’ మొదలైంది(1967). సైన్సు శక్తి, విధాన నిర్ణయం, రైతుల ఉత్సాహం– ఈ మూడూ కలగలిసి ‘యూఎస్‌ఎయిడ్‌’కు చెందిన విలియమ్‌ గాడ్‌ నోటి నుంచి తొలిసారిగా వెలువడిన మాట ‘గ్రీన్‌ రివొల్యూషన్‌’ అనేది విజయవంతమైంది. అయితే, దాని ప్రతికూల ప్రభావాలు కూడా ఎంఎస్‌కు తెలుసు. అందుకే ‘ఎవర్‌గ్రీన్‌ రివొల్యూషన్‌’ కావాలని కాంక్షించారు.

1981లో ఫిలిప్పైన్స్‌లోని ‘ఇంటర్నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ డైరెక్టర్‌ జనరల్‌ పదవి ఆయన్ని వరించింది. ఆ స్థానంలోకి వెళ్లిన మొదటి ఆసియన్‌ ఆయన. ఐఆర్‌64 లాంటి పాపులర్‌ వరి రకం ఈ కాలంలోనే వచ్చింది. ప్రణాళికా సంఘం, వ్యవసాయ మంత్రిత్వ శాఖల్లోనూ పనిచేసిన స్వామినాథన్‌ పాత్ర ఇండియాకే పరిమితం కాలేదు. చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, మయన్మార్, ఈజిప్ట్, మడగాస్కర్, థాయిలాండ్, బంగ్లాదేశ్, టాంజానియా, ఇథియోపియా లాంటి ఎన్నో దేశాల్లో వరి పరిశోధనా కేంద్రాలు ఏర్పాటయ్యేలా సహకరించారు. టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించిన అత్యంత ప్రభావశీల ఆసియన్ల జాబితాలోని ముగ్గురు భారతీయుల్లో స్వామినాథన్‌ ఒకరు (మిగిలిన ఇద్దరు: గాంధీజీ, టాగూర్‌). ‘పది జీవితాల్లో కూడా సాధించలేనిది ఆయన ఒక్క జీవితంలో సాధించారు’ అంటారు రచయిత్రి. ముగ్గురు కూతుళ్ల తండ్రిగా, స్వతంత్ర భావాలున్న భార్య మీనా భర్తగా ఆయన కుటుంబ విశేషాలు, ఆయన పదవిలో ఉన్నప్పుడు జరిగిన సంగతులను మేళవిస్తూ పది అధ్యాయాలుగా రాసిన పుస్తకమిది. గాంధేయవాదిగా, పర్యావరణవేత్తగా, వ్యవసాయంలో స్త్రీల పాత్ర తెలిసినవాడిగా ఆయనలోని బహుకోణాలు తెలుస్తాయి. ఫిలిప్పైన్స్‌ వదిలివచ్చేటప్పుడు టగలాంగ్‌లో వీడ్కోలు ఉపన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మీనా. రైతుల కోసం నియమించిన జాతీయ కమిషన్‌(స్వామినాథన్‌ కమిషన్‌గా పేరుపడింది)తో సహా కొన్ని పదుల కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించి; రామన్‌ మెగసెసే, వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్, భారతరత్న లాంటి ఎన్నో గౌరవాలు పొందిన ఎంఎస్‌ తన జీవితంతోనే ఆశ్చర్యపరిచారు.

(3-11-2025)